LOCAL WEATHER

25, డిసెంబర్ 2012, మంగళవారం

దైవభక్తులారా దేవుడి కోసం మీ ఒక్క శలవైనా త్యాగం చెయ్యలేరా..????



పండగలు వస్తే చాలు, అవి ఏ శనివారమో, సోమ వారమో వస్తే మరీ వీరాంగం వేస్తున్న భక్త శిఖామణులు...... ఏమున్నదీ ఆ శలవలలో అందరికీ లోకువైన ఏ తిరుమలకో బయలు దేరటం...... అక్కడికి పోయిన తరవాత, తమని వీఐపీల లాగా చూడలేదని ఆక్రోశం వెళ్ళగక్కటం మాములైపోయింది.... వారి కళ్ళముందే ఎవరెవరో వీఐపీ దర్శనంలో వెడుతుంటే, భక్త శిఖామణుల కోపం మరింత ఆక్రోశించి దేవాలయాలనే శపించేస్థాయికి దిగజరిపోతున్నారు..... మొన్న చాలామంది టీటీడీ డౌన్ డౌన్ అని అరిచారు ధర్నాలు చేశారు... గొడవలు పడి దేవాలయ ప్రాంగణాన్ని రణరంగాన్ని చేసిపారేస్తున్నారు..... టీటీడీ అంతే అర్ధం తెలుసా వీరికి......"తిరుమల తిరుపతి దేవస్థానములు" అని అర్ధం....   ఆ........ ఆ సంగతి మాకు తెలుసులేవయ్యా అని అహంకరించే భక్త  శిఖామణులకి చెప్పేది ఏమున్నది.....??

ఒక దేవాలయానికి వెళ్ళేటప్పుడు అక్కడి పరిస్తితులకి అణుగుణంగానే మన మైండు సెట్ మార్చుకోవాలి... అక్కడికి వెళ్ళిన వేలాది, లక్షలాది భక్తులలో మనం కూడా ఒకరిమే...... లేదా దొంగదారిన వెళుతున్న వీఐపీలలో ఒకరు అవ్వాలని ప్రతీ వారు అనుకొంటే అక్కడి పరిస్థితీ అంతే కదా.... మన లాగానే ఇతరులూ వచ్చారు.. వారిలాగానే మనమూ వచ్చాము అని అనుకోకుండా ఉన్న వారికి .... దైవంతో పని ఏమున్నది...? మనకే తొందరగా దైవ దర్శనం కావాలీ అని ప్రతీ వారూ అనుకోబట్టే తిరుమలలో పరిస్థితి అలా దిగజరింది.  సమస్య మూలం లోనికి వెళ్ళకుండా అక్కడ పని చేసే వారిని తిడుతున్నామనుకొని.....దేవస్థానాలనే తిడుతున్నారు.



 
 
సరే, లక్షలు మందీ వచ్చే చోట దేవస్థానం సిబ్బంది ఏదో అవకతవకలు చేస్తున్నారనే అనుకొందామూ..... మరి మనం పని చేసే చోట పరిస్థితి ఏమిటీ;  ఫదులూ వందలూ వచ్చే కౌంటర్లలోనే, ఎవరైనా తెలిసిన వారు వస్తే వెనక నుండీ పని చేసి పంపిస్తునామా లేదా....... ఒకసారి గుండెల మీద చెయ్య వేసుకొని చెప్పాలి మన భక్త శిఖమణులు.... అలాంటి దిక్కుమాలిన ఆబ్లిగేషన్లు ఫదులూ వందలు ఉండే కౌంటర్ల దగ్గరే ఉంటే.... లక్షలు వచ్చే చోట పనిచేసే వారి మీద ఎంత వత్తిడి ఉంటుంది...? అక్కడ పనిచేసే వారు దేవతలేమీ కాదు కదా... కేవలం సగటు సామాన్యులే  కదా....!!!  అది గమనించకుండా దేవస్థానాలని శాపనార్ధాలు పెట్టటం సమంజసమేనా.....   ఎక్కడ ఏది జరిగినా "అధికారులు రాలేదు" అని ఒక మాటని మీడీయా మరియూ సామాన్య జనం వాడేస్తునారు......"అధికారులు అంటే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షం కాగల శక్తులున్నవారా"...??  వారికి ఉండే పరిమితులు వారికీ ఉంటాయి...  అయినా అధికారులూ, పాలక  వర్గాలని ఏకి పారెయ్యటానికి వారి నుండే ప్రత్యేక దర్శన పాసులు తీసుకొనే మీడియా ఉండనే ఉన్నది...... వారికి తోడు ప్రతిపక్ష వీఐపీలూ మరియూ పూర్తి బాధ్యతగల పౌరులూ ఉన్నారు......

కానీ, అసలు మనం సరిగ్గానే వ్యవహరిస్తున్నామా... అని ఎవరికి వారు ఒకసారి ప్రశ్నించుకొంటున్నారా....??? ఇప్పుడు సమస్య మూలంలోనికి వెళ్ళి చూద్దాం.... ఒక్కసారిగా ఒకే దేవాలయం మీద వేలూ లక్షలూ వచ్చి పడుతుంటే అక్కడి సమస్య దేవాలయం కాదు..... అలా ఒక్క సారిగా వచ్చిన వాళ్ళే ఒక పెద్ద సమస్య...  సమస్యని మనలో పెట్టుకొని దేవాలయాలని నిందించటం తగునా...? మరి ఆ సమస్య రాకుండా ఉండాలంటే అధికారుల కన్నా ముందర మన బాధ్యత ఎక్కువ ఉన్నది. ఎందుకంటే మనం వెళ్ళేది మన భార్యా పిల్లలతో..... వారి బాబోగులు చూసేది మనమే కదా... వారికి ఎలా సౌకర్యవంతంగా ఉంటుందో మనమే చూసుకోకుండా బయలుదేరి, అధికారులని నిందిస్తే ప్రయోజనం ఏమున్నది...? అందుకని వెళ్ళే ముందర కొన్ని ఆలోచనలు ఈ క్రింది విధంగా చేస్తే చెయ్యగలిగితే ఏ సమస్యా ఉండకపోవచ్చును..... దేశమంటే మనమే కదా..... మన లాంటివారే కదా దేశమంటే......!!!


 1] మనం వెళ్ళబోయే దేవస్థానంలో రోజుకి ఎంతమంది దర్శనం చేసుకొనే వీలున్నది.......? శలవ రోజులలో రద్దీగా   ఉంటున్నాయా...?? ఈ ప్రశ్నలకి సమాధానంగా ... ఈ రోజు మనకి అందుబాటులో ఉన్న మీడియా చానళ్ళని ఉపయోగించుకొని తెలుసుకోవచ్చును...
 

2] రెండు రోజులు శలవలు కలిసి వస్తున్నాయి కదా అని మనమే బయలు దేరామా.....? మన లాగానే ఎన్నో లక్షల మంది ఆలోచించ వచ్చును కదా...... వారందరూ వచ్చి పడితే మన గతి ఏమిటీ అని మన సంగతి మనం ఆలోచించుకొన్నామా......?  లేదు. మన గురించి మనమే జాగ్రత్త తీసుకోవాలి కానీ ....... అధికారులు కాదు కదా...!!!
 

3] దేవుడు శలవ రోజులలోనే దేవాలయంలో ఉంటారా...? లేదు కదా..... మరి మనమెందుకు శలవలు కాని రోజులలో శలవు పెట్టి వెళ్ళటం లేదు..? సమాధానంగా ఏమి చెప్పాలి.....? దేవుడి కోసం మనం మనకున్న శలవులలో ఒక్క శలవైనా వాడలేమా....?
 

4] దేవుడిని చూడటానికి కూడా మంచి రోజులు అనేవి కొన్నే ఉంటాయా.....? కేవలం అప్పుడే దేవుడు అక్కడ ఉంటారా?...... ఏదో కేంప్ కార్యాలయంలో  ఉన్నట్లుగా........ ఆ ప్రతేక రోజులలోనే దేవుడు అక్కడ ఉండి మనని కరుణిస్తాడా....??? అలా అనుకునేట్లైతే మనకి  దేవుడి మీద నమ్మకం లేనట్లే అనుకోవాలి.
 

5] మన మీద మనకి గౌరవం ఉన్నట్లే మన తోటివారి మీద కూడా అంతే గౌరవం ఉన్నదా....? దేవాలయాల్లోనే కాదు ఎక్కడ ఏ లైనులో చూసినా ఈ భావం మచ్చుకైనా కనపడదు.... మన తోటి వారిని మన లాగానే చూడగలిగితే ఏ సమస్యా ఉండదు.
 

6] తొక్కిసలాట జరిగే చోటికి మనమే వెళ్ళామా....? అక్కడ  మన లాంటి వారి వల్లనే అలా జరుగుతోందా...??
 

7] అవకాశం వస్తే మనం కూడా బ్రేక్, వీఐపీ దర్శనంలో వెళ్ళి "మాకు గంటలో దర్శనం అయింది" అని చెప్పుకొంటున్నామా...? 

పైన విషయాలని ఒక్కటి కూడా ఖాతరు చెయ్యకుండా, రద్దీ సమయాలలో  దేవాలయానికి వెళ్ళి అక్కడి వారిని తిట్టే హక్కు మనకున్నదా.......అలాగే దేవస్థానంకి సంబంధించిన వారు కూడా పండగలనీ, ముఖ్యమైన రోజులనీ భక్తులని రెచ్చగొట్టినప్ప్పుడు దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి. ఆ రోజులకి ఎంతమందికి దర్శనం కల్పించగల శక్తి ఉన్నదో అంత మందినే కొండపైకి అనుమతించాలి.......సామాన్యుల కోటా ఎంతా,  ప్రత్యేకించి కొమ్ములు కలవారికి ఎంత కోటా అనేది ముందర రోజులలోనే నిర్ణయించి, క్రింద తిరుపతిలోనే విపరీత భక్త జనాన్ని నిలువరించాలి. తమ ఆబ్లిగేషను పీడలని సాద్యమైనంతవరకూ తగ్గించుకోవాలి........ ఇలా అడ్డ దారిలో వెళితే పుణ్యం రాదనీ, పైగా ఇతరులని ఇబ్బంది పెట్టటం వలన పాపం కూడా వస్తుందని స్వామీజీలూ సన్యాసుల చేతా ప్రచారం చేయించాలి. పెద్ద పెద్ద బోర్డులూ పెట్టాలి.  "ఇలా అడ్డ దారిలో వెళ్ళటం మహా పాపం అని   వీఐపీ పాసుల మీద  ముద్రించాలి".

మనం కూడా, దైవికంగా వచ్చే శలవలనీ, వారంతపు శలవలనీ ఈ గొడవల సంగతి తెలియక, సాధారణ దర్శనంలో 20 గంటలు నుంచొనే చదువు రాని వారికీ, అమాయకులకీ, మూర్ఖులకీ,  విపరీత నమ్మకాలున్న గ్రామీణులకీ వదిలేద్దాం..... హాయిగా మన శలవల్ని మన  కోసం అదే దేవుడికోసం వాడి  కోపతాపాలనీ అందోళనీ లేని వాతావరణంలో చక్కని దైవదర్శనం చేసుకొందాము. తిరుమల చేరుకోవటానికి సోమవారం మధ్యాహ్నం నుండీ శుకృవారం మధ్యాన్నం వరకూ మంచి అనుకూలమైన వాతావరణం. అంటే మధ్యలో ఉన్న మంగ్ళ, బుధ, గురువారాలలో కనుక తిరుమల వెళ్ళి దర్శనం చేసుకొంటే చాలా చక్కగా అవుతుంది. ఎటువంటి తొక్కిసలాటా ఉండదు... రూములూ దొరుకుతాయి... అంతే కాదు తిరుపతికి వెళ్ళటానికీ, తిరిగి ఇంటికి వెళ్ళటానికీ రైల్ టిక్కెట్లు పెద్దగా కష్ట పడకుండానే దొరుకుతాయి. ఇంకో విషయం, తిరుమలలో ముఖ్యమైన రోజూ అని అందరూ అనుకొనే కాలంలో అక్కడికి వెళ్ళకపోవటమే మేలు. లేదా ఆ కష్టాలు పడటానికే సిద్ధమై వెళ్ళాలే కానీ..... అక్కడ వ్యవస్థనీ, తోటి భక్తులనే కాకుండా ఏకంగా దేవాలయాలనే విమర్శించ కూడదు.... దాని బదులు మనం మనని విమర్శించుకొంటే మనకే కాదు మన తోటివారికి కూడా కష్టం  లేకుండా చేసిన వారు అవుతాము. 
 


@@@@@@@@@@@

     

3 కామెంట్‌లు:

  1. "...ఇలా అడ్డ దారిలో వెళ్ళటం మహా పాపం అని వీఐపీ పాసుల మీద ముద్రించాలి..."

    A very good suggestion. I hope TTD implements it.

    తిరుపతిలో పై కొండ మీద ఒక పెద్ద విగ్రహం అంటె కిందనుంచి కూడా కనిపించేంత ఎత్తున్న వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ఏర్పరచాలి. కిందనుంచి చూసి కిందనుంచే వెళ్ళిపోతే మరింత పుణ్యం అనే ప్రచారాన్ని కలిగించాలి. లేకపోతే తిరుమల ఈ భక్త తాకిడీని ఇంకా ఎన్నోరోజులు తట్టుకోలేదు.

    రిప్లయితొలగించండి
  2. మీరు చెప్పినది ఎంతోమందికి నచ్చకపోయినా సరిగా చెప్పారు.

    రిప్లయితొలగించండి
  3. శివరామప్రసాదు కప్పగంతు గారూ, సురేష్ బాబు గారూ స్పందించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి