LOCAL WEATHER

20, ఏప్రిల్ 2012, శుక్రవారం

వీధి కుక్కలు


వీధి కుక్కలు

ఆ రోజు........ ఇంగ్లిషు సాయంత్రం...అంటే బాగా చీకటి పడిందన్నమాట. ఒక చిన్న పిల్లవాడి ఆర్తనాదం అదేపనిగా వినిపించింది. గభాలున బయటకు వెళ్ళి చూద్దుము కదా కొన్ని వీధి కుక్కలు సైకిలు మీద వెళుతున్న కుర్రాడి చుట్టూ చేరి పీడిస్తున్నాయి...అనేక మంది బయటకు వచ్చినా....... వారిలో ఒకరిద్దరు వాటిని చెదరగొట్టి ఎవరిదారిన వారు లోపలకు పోయి "టీవీల ధ్యానంలో" పడిపోయారు.


మళ్లీ రెండవ రోజు, మూడవ రోజు ఇదే తంతు. చివరికి ఒకాయన తెగించి "ఈ కుక్కలతో చచ్చిపోతున్నాము" అన్నాడు. ఇది విన్నంతనే అప్పటిదాకా నోరు మెదపని మరొకాయనకి తనకి తెలియకుండానే తన భావం బయటకి వచ్చి పడింది;  "ఊర్కోండి అవ్వి ఉండ బట్టే కదా రాత్రిళ్ళు  హయిగా నిద్రపోతున్నాము" అని.......

అక్కడితో డిస్కషన్ మొదలైంది. అసలు విషయం పోయి అసెంబ్లీ లాగా తయారైంది. మిగిలిన వారు టీవీలలో "అసెంబ్లీ లైవు" చూసే అలవాటు ఉండటం వలన జరిగేదానిని చక్కగా చూస్తూ, వింటూ ఉండిపోయారు.  మాములుగానే  అసలు విషయం తేలకుండానే వారి డిస్కషన్ వాయిదా పడింది.

ఇంతకీ, ఈ వీధి కుక్కలు; కుక్క నుండి కుక్కలుగా మారి మా వీధిలో వంశపారంపర్యంగా స్తిరనివాసం ఏర్పరుచుకొని మాములుగానే ఉండేవి.  మేము పడేసేవి తిని అలా బ్రతికేసేవి. కానీ ఈ మధ్య మా ప్రక్కన అపార్టుమెంటు కట్టటం మొదలైయ్యే సరికి  అక్కడికి వచ్చినకూలీలు  తదితరులు వాటికి "మాంసాహారం" పడెయ్యటం మొదలు పెట్టారు. దానితోఅప్పటిదాకా మా తిండితో బ్రతుకుతున్న వీధి కుక్కలకి మేమంటే లెక్క  లేకుండాపోయింది... చులకనై పోయింది.  "బయట తిండి ప్రభావం" మరి........


సరే, యధావిధిగా రోడ్డున పోయేవారిని అవి పీడిస్తూనే ఉన్నాయి. కొందరు బయటకు రావటం మానేసారు, కొందరు మనదాకా వచ్చినప్పుడు చూద్దాంలే అని ఊరుకుండిపోయారు, మరి కొందరు మనకే పట్టిందా అనీ....... మరి ఇంకొందరు "దారే పొయ్యే వారుజాగ్రత్తగా వెళ్ళద్దూ" అనీ బాధితులనే బాధించారు; ఇలా సహజమైన స్వదేశీతత్వంతో మిన్నుకుండిపోయారు. 


ఇహ లాభం లేదనుకొని, ఒకాయన వీటి గురించి మీటింగు అన్నాడు...... ఆ ఆయనంతే, పనికిమాలిన విషయాలను నెత్తికెత్తుకుంటాడు అని కొందరూ, "ఆ ఆయనతో మనకేమన్న ఇప్పుడు పనులున్నాయా ఏమిటి", ఆని చాలా మంది రాలేదు. ఇక వచ్చింది ఇద్దరు ముగ్గురు; "బాబూ అవి మా అపార్టుమెంట్ మెటిరియల్‌ని కాపలా కాస్తున్నాయి, వాటితో మాకేమి ఇబ్బంది లేదు" అని...... ఆ  ఇద్దరు మూగ్గురులో ఒకాయన అన్నాడు. మరొక పిసినారి డబ్బున్న వాడు; "ఇవి కాణీ ఖర్చు లేకుండా రాత్రిళ్ళు కాపలా కాస్తున్నాయిగా ఎవరిగోలో మనకెందుకు?" అని ప్రశ్నించాడు... "అవును కదా!! ఎవరి అవసరాలు వారికున్నాయి" అన్నారు ఇద్దరు ముగ్గురులో.......మరిద్దరు.

ఇంత పేద్ద దేశంలోని ఒకానొక  రాష్ట్రం, దానిలో ఒకానొక జిల్లాలోని ఒక నగరం. అందులోని ఒక పేట, అక్కడి ఒక వీధిలోని ప్రజలే ......... వీధి కుక్కలు లాంటి చిన్న విషయానికే ఇన్ని రకాలుగా ఆలోచిస్తుంటే......ఇంత పేద్ద దేశంలో పేద్ద అవినీతి రాజకీయల గురించి ఏకాభిప్రాయం ఎలా వస్తుంది? 


"ప్రతీ దాంట్లోంచి మనకేమిటి" అంటూ ఆలోచిస్తుంటే......దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి వంటి పెద్ద సమస్య  గురించి ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉందంటారా??  ఏది మంచి ఏది చెడు అన్న విషయం అనేది నిర్ణయించటానికి ప్రతీ మనిషికి తన అవసరం, తనకు మేలు చెయ్యటం వంటివి మాత్రమే ప్రాతిపదికగా తీసుకున్నప్పుడు దేశానికి మేలుజరుగుతుందా...???  అందుకనే అవినీతి వ్యతిరేక ఉద్యమం మొత్తంగా విఫలం అయికూచుంది, లేదా "విఫలం అయిపోయింది" అని అందరూ అనుకునేట్టుగా చేసేశారు. "అవునులే ఎవరి అవసరాలు వారికుంటాయి కదా మరి".



జై హింద్ 

2 కామెంట్‌లు:

  1. మనకెందుకు రాధాకృష్ణ గారు ఈ గోల. లంచం అనే అంశం వుండబట్టే కదా మీరు ఈ టపా రాసారు. (Just kidding)...
    ఇంటికో అన్నా హజారే , బాబా రాందేవ్ కదం తొక్కినా పని అయ్యేలా లేదు.
    కాని మార్పు చాలా త్యరగా కావాలి, లేకపోతే బారతీయుల జీవితం అధోగతే.....

    మీ టపా చాలా బావుందండి.....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామ్ గారు ధన్యవాదాలు. మార్పు ప్రజలలోనే రావాలి అనేదే నా ఉద్దేశం.

      తొలగించండి