LOCAL WEATHER

30, మార్చి 2012, శుక్రవారం

కొత్త జాతీయ గీతం

బయట పని చూసుకొని ఇంటికొచ్చి అలా రిఫ్రెష్ అవుదామని యూట్యూబులో విహరిస్తుంటే "కొత్త జాతీయ గీతం" అని కనపడింది. సరె, అదేమిటో చూద్దామని క్లిక్ చెస్తే ఒక చక్కటి విడియో కనపడింది. మన సమాజం ఎలాంటి నాయకత్వ లోపంతో ఉన్నాదో; రాజకీయ నాయకుడు కారు దిగి వస్తుంటే అతడేదో చేస్తాడని ఆశించిన కుర్రాడి ఆశాభంగం చక్కాగా చిత్రీకరించారు. అది ఇప్పటికే 363,105 మంది చూసారు. మీరు చూసున్నా మరోసారి చూడండి....అలాగే దానికింద ఉన్న కామంట్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.



तुम चलो तो हिन्दुस्तान चले






25, మార్చి 2012, ఆదివారం

ప్రజాసామ్యం అంటే 20 ట్వెంటీ క్రికెట్టు మేచ్ లాంటిదా!!!..?

ఇప్పుడూ కొత్త ఈవీఎం మెషీనులొచ్చిన తరవాత ఇన్‌వేలిడ్ అదే చెల్లని ఓట్లు లేవని ఒకాయన, నా నియోజక వర్గ ప్రజలందరూ నేను చెప్పిందే కోరుకుంటున్నారు అని మరొకాయన అంటుంటే నాకు వాటిమీదకు దృష్టి పోయింది. ఇప్పుడు చెల్లని ఓట్లు లేనే లేవా....ఆ గెలిచేవాడు ఆ ప్రాంత ప్రజల మనోభావాలకి తగ్గట్టే గెలుస్తున్నాడా.....

ప్రజాసామ్యం అంటే 20 ట్వెంటీ క్రికెట్టు మేచ్ లాంటిదా...? ఒక జట్టుకన్నా మరొక జట్టు ఒక్క పరుగు ఎక్కువ కొడితే గెలవటానికి?

ప్రజాసామ్యం అంటే ఎక్కువమంది అభిప్రాయం ప్రకారం ఎన్నుకోబడిన వారిచే నడపబడే ప్రభుత్వమని అర్ధమయితే....ఇప్పుడు జరిగే ఎన్నికల వలన అలాంటి ఫలితాలే వస్తున్నాయా...?

ఉదాహరణకి ఒక నియోజక వర్గంలోని ప్రజలు సామాన్యంగా 60శాతం ఓటేస్తే; ఆ వచ్చిన ఓట్లలో ఎవరికి ఎక్కువ వస్తే వారు ఆ ప్రజలందరికీ అంటే ఆ ప్రాంత ప్రజల అందరి మనోభావాలని ప్రతిబింబిస్తున్నారని అనుకోవచ్చునా...?

అరవై శాతం ఓట్లలో ఒకడికి 35 శాతం మరొకడికి 33 శాతం, ఇంకొకరికి 21 శాతం మిగిలినవి -- కలగూరగంపలోలా నుంచునే స్వతంత్ర అబ్యర్ధులనబడే అసంతృప్తులు పొందుతారు. వీరిలో కేవలం 35 శాతం[అనగా కేవలం 21 మంది] వచ్చిన వాడు గెలిచినట్లా....? ఈ గెలిచిన వాడు మిగిలిన 79 మందికీ ఎలా ప్రాతినిధ్య వహిస్తాడు అనేదానికన్నా; ఇలా గెలిచిన వాడు మొత్తం ఆ నియోజక వర్గ ప్రజలందరి మనోభావాలకి అద్దం పట్టేవాడని ఎలా అనుకోగలము....?

మరి పై లెక్కలని అనుసరించి నూటికి 70 నుండి 79 మంది ఓట్లు చెల్లుబాటు అయినట్లేనా....?

పైన శాతాల సంగతి అటుంచితే; అసలు ఆ నియోజకవర్గంలో నుంచునే వాడిని ఆ నియొజకవర్గ ప్రజల అనుమతితోనే నుంచో పెడుతున్నారా .....?

తీరా గెలిచిన వాడు తాను గెలిచినది ప్రజాబలంతోనే అని గుండెమీద కాకపోయినా కనీసం ఎవరి నెత్తిన చెయ్య పెట్టైనా చెపుతున్నారా.....?

గెలిచిన వాడికి వాడి నియోజక వర్గ ప్రజల సమస్యలు కానీ కనీసం దాని పరిధులు అయినా తెలిసి ఉంటున్నదా......?

రాజరిక పరిపాలనా కాలంలో దుష్పరిణామాలు తెచ్చిన "వంశపారంపర్యం" ప్రజాసామ్యంలో వాడుకొంటూ, దానిని ప్రజలు అమోదించేసినట్లుగా ప్రచారం చేసే "చెంచాల" మాట కరెక్టేనా....?



పై వాటిలో ఏ ఒక్కటైనా "అవును" అని సమాధానం వస్తే మనం ప్రజాసామ్యంలోనే ఉన్నామని అనుకోవటానికి వీలున్నది.

నేననుకోవటం పైవాటి సమాధానాలు చెప్పాలంటే ఏ మాత్రం కనీస రాజకీయ పరిజ్ఞానం లేకుండానే "కాదని" చెప్పవచ్చును. మరైతే మనం ప్రజాసామ్య పద్ధతిలోనే ఉన్నామని అనుకోవడం మనని మనం మోసం చేసుకొవటమే కదా...

సరే, మొత్తం కాక పోయిన కనీసం కొన్నైనా "అవును" అని అనిపించటానికి ఇలా చెస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

రాజకీయ నాయకులకి

1.అన్నిటికన్నా ముందర ఎన్నికలలో నుంచునే వారిని నియంత్రించాలి. అంటే ఎవరైనా వారి జీవిత కాలంలో రెండుసార్ల కన్నా గెలిచే అవకాశం ఇవ్వకూడదు. అనగా దేశంలోని ఏవ్యక్తికి అయినా 10 సంవత్సరాల అధికార కాలం[టైం] మాత్రమే ఇవ్వబడుతుంది.

2.అలా గెలిచిన వారి కాల వ్యవధి అయిన తరవాత, కనీసం 20 యేళ్ళ వరకూ ఆ వ్యక్తి వారసులు రాజకీయాలకి సంబంధించి ఎక్కడా ఎటువంటి పదవిలో ఉండకూడదు. 20 యేళ్ళ తరవాత మాత్రమే అటువంటివారు రాజకీయ పదవులకి అర్హులు. వారు కలిసున్నా విడాకులు తీసుకున్నా...

3. ముఖ్యమైనది, ఏ వ్యక్తి అయినా ఒక రాజకీయ పార్టీ తరపున నుంచోవాలంటే అతను కనీసం ఆ పార్టీ సభ్యత్వం తీసుకొని అయిదు యేళ్ళు పైబడి ఉండాలి. అలా 5 సంవత్సరాలు పార్టీలో పనిచేసిన తరువాతే అతను ఎటువంటి టిక్కెట్టుకైనా అర్హుడు.

3A. అలాగే ఏ వ్యక్తి అయినా స్వతంత్ర అభ్యర్ధిగా నుంచోవాలంటే ఆ వ్యక్తి కనీసం అయిదు సంవత్సరాలు పైబడి ఏ రాజకీయ పార్టీలో గానీ సభ్యత్వం ఉండకూడదు.

3B. ప్రభుత్వ ఏర్పాటుకు ఇండిపెండెట్ల ఓట్లు చెల్లవు, కేవలం నియొజక అభివృధి మాత్రమే అతని భాధ్యత.

4. అలాగే నుంచునే అబ్యర్ధి ఏదైనా రాకీయ పార్టీ తరపున నుంచునేట్లు ఉంటే అతని పూర్తి బాధ్యత ఆ పార్టీ అధ్యక్షులే వహించాలి. అంటే అతడు చేసే తప్పుడు పనులకి ఆ పార్టీనే పూర్తి బాధ్యత వహించాలే గానీ, అతడిని రాజీనామా చేయించినంత మాత్రన ఆ బాధ్యత నుండీ తప్పించుకోజాలదు.

5. ఒక నియోజక వర్గంలో నుంచునే వ్యక్తి "పూర్తిగా" పుట్టుకతో ఈ దేశం వాడవటమే కాకుండా, అతని ఓటు ఆ నియోజక వర్గంలో కనీసం అయిదు సంవత్సరాల పైబడి ఉండి తీరాలి.

6.నుంచోటానికి ఎటువంటి డిపాజిట్లు వసూలు చెయ్య కూడదు. కానీ, పోలైన ఓట్లలో కనీస శాతం ఓట్లు రావాలి. అలా పడక పోతే 10 సంవత్సరాల వరకు అతడు తిరిగి నుంచో కూడదు.

7. ఎన్నికలలో నుంచుని ఓడిపోయిన అధికార మరియు ప్రతిపక్ష పార్టీ సభ్యులకు గానీ, వారి కుటుంబ సభులకు కానీ, వారి బంధువులకు గానీ మరియు వారి సంబంధీకులకు గానీ ఎటువంటి ప్రభుత్వ భాధ్యతలు లేక కాంట్రాక్టులు ఇవ్వరాదు. వారికి ప్రభుత్వం తరపు నుండి ఎటువంటి కేటాయింపులు వుండరాదు. అలాగే గెలిచిన వారు తప్ప వారి కుటుంబ సభ్యులకు మరియు ఏ సంభంధీకులకు ప్రభుత్వ లాభదాయకాలు అందనీయరాదు.

8. ఎన్నికలలో నుంచుని తక్కువ మార్జినుతో ఓడిపొయిన సభ్యులను ఎగువ సభకు డైరెక్టుగా పంపాలి. పై నుండి క్రిందకు మార్జిన్ లెక్కించాలి. ప్రతిపక్ష సభ్యులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.

9. ఎన్నికలలో నుంచున్న వ్యక్తులు ప్రచారములో తమ పరిధికి మించి వాగ్దానాలు చెయ్యరాదు.

10. ఎంతకాలం వున్నా, ఎటువంటి బంధుత్వం వున్నా విదేశీయులు ఎన్నికలలో నుంచోటానికి అనర్హులు. వీరు రాజ్యాంగ సంస్థలు మరియు రాజ్యాంగ అమలు సంస్థలు మరియు మరే ఇతర ప్రభుత్వ అజమాయషీలకి అనర్హులు.

11. దేశానికి సంబంధించిన ముఖ్యమైన పదవులు అన్ని రాష్త్రాలకీ, మరియు రాష్ట్రానికి సంబంధించి అన్ని జిల్లాలకీ రావాలి. అన్నీ అయిపోయిన తరవాత గానీ మరల వచ్చినవి రాకూడదు.

12. ఒక సారి ఎన్నిక అయిన వ్యక్తి ఆ 5 సంవత్సరాల కాలం తప్పని సరిగా సభ్యునిగా వుండవలెను. అతడు చనిపోయిన, అవినీతికి పాల్పడినప్పుడు గానీ మాత్రమే ఉప ఎన్నిక గురుంచి ఆలోచించాలి. ఏ వ్యక్తి అనవసర మాటలకి కట్టుబడి రాజీనామా చెయ్యరాదు. ఒకవేళ రాజీనామా చెయ్యవలసి వస్తే రాజీనామా చేసిన సభ్యడు ఉప ఎన్నికలలొ నుంచో రాదు.


ఓటర్లకి

ఓటరు గుర్త్తింపు "పంచింగ్ కార్డు" తప్పనిసరి. ఈ ఓటరు కార్డు మిద "పంచ్ ఉంటేనే" డ్రైవింగు లైసెన్సు, బ్యాంకు అక్కౌంట్, విదేశీ ప్రయణాలకి,
ప్రభుత్వ ఉద్యోగాలకి , వ్యాపార లైసెన్సులకి, ప్రభుత్వ పధకాలకి, రైల్వే రిజర్వేషనుల లాంటి మొదలగు సౌకర్యాలకి ఈ కార్డు తప్పనిసరి చేయాలి.


రోగి మరియూ రోగ లక్షణాల బట్టి మందిచ్చినట్లే ఇప్పటిదాకా జరుగుతున్న దాని లక్షణాలబట్టి ప్రజాసామ్యానికి పైన మందులిస్తే ప్రజాసామ్యం తిరిగి పునరుజ్జేవనం అవుతుందనే నా ఆశ. లేదా ఈ అయిదేళ్ళ రాజరిక పాలనని మనం అనుభవించి తీరవలసిందే.....

జైహింద్


పైన బొమ్మలన్ని గూగుల్ IMAGES పుణ్యమే

22, మార్చి 2012, గురువారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు


శ్రీ నందన నామ సంవత్సర శుభాకాంక్షలు
శ్రీ నందన నామ సంవత్సర శుభాకాంక్షలు


శ్రీ నందన నామ సంవత్సర శుభాకాంక్షలు

18, మార్చి 2012, ఆదివారం

హలొ హలొ "ముస్తఫాయా"....

Inline image 4
హలొ హలొ "ముస్తఫాయా"....
అదేమిటి అసలు పా"హలొ హలొ అమ్మాయి పాత రోజులు మారాయి" కదా..!!!
Inline image 6
అవును నిజమే, నేను రకరకాల పాటల కోసం భాషా బేధం లేకుండా "మీ గొంతు"లో {అదే యూట్యుబుకి నేను పెట్టుకొన్న పేరు} వెతుకుతుంటే బాబ్ అజం అనే ఆయన ముస్తఫాయ అనే అరబిక్ పాట వినటం జరిగింది. ఇది సరిగ్గా మన హలొ హలొ అమ్మాయి పాట ట్యూన్లోనే ఉండటంతో, మరింత వెదకగా ముస్తఫయ ఏక్షన్ పాట కూడా చూడటం జరిగింది.

Inline image 12
అది చూసిన తరవాత కేవలం పాట ట్యూనే కాకుండా పాటకి తగ్గ ఏక్షను కూడా ఒకలాగానే ఉన్నది. ఆ పాట అర్ధం కాకపోయినా ఏక్షను బట్టి మన పాట అరబిక్ పాట అర్ధం ఒకటే అనిపించింది. మొత్తం మీద సంగీతానికి భాషలు, ఎల్లలు లేవని.....ప్రపంచ సంగీతం ఒక్కటే అనిపించింది.

Inline image 11

సరె ఆ రెండు పాటలు కలిపి ఒకటిగా చేసి పెడితే బాగుంటుంది కదా...

Inline image 9

అలా రెండు ఆడియోలు కలిపి క్రింద వీడియోగా తయారు చేసాను చూసి/ విని ఆనందించండి.


పైన వున్న అసలు పాటలు వినాలంటే ముస్తఫాయా పాట ఈ క్రింద ప్లేయర్లో వినవచ్చు


Found at Beemp3.com





ముస్తఫాయ వీడియో పాట క్రింద చూడండి.


హలొ హలొ అమ్మాయి పాట ఈ క్రింద చూడండి.


ఏది ఏమైనా కాపీ పాట అయినా సరే మన తెలుగు పాట తెలుగు పాట లాగానే ఉన్నది కాని కాపీ కొట్టినట్టుగా తెలియటం లేదు. ఏమైనా కాపీ కొట్టటమూ ఒక కళే!










4, మార్చి 2012, ఆదివారం

అయ్యప్ప భక్తి యాత్ర లేక సామాజిక ఉద్యమమా!!!

కొన్ని దశాబ్దాలుగా అందరూ వెళ్ళటం చూసి చూసి నాకు చాలా సంవత్సరాల నుండి శబరిమల చూడాలన్న కలిగిన కొరిక ఎట్టకేలకు ఈ సంవత్సరం తీరింది. నన్ను తీసికెళుతున్న గురుస్వామి [పేరు లక్ష్మీనారాయణ గారు] "మాల వెస్తారా" అని అడిగారు, కానీ నాకు మానెయ్యవలసినంత చెడ్డ అలవాటులు ఏమీ లేనందున మాల వెయ్యలేదు.


కానీ, యాత్ర మొదలైన తరవాత తెలిసింది మాల వెయ్యటం దీక్ష తీసుకొవటం అనేది మనుషులలో ఎంత మార్పు తెస్తుందో.....ఎందుకంటే ఎంతో కఠినమైన మనుషులు కూడా సాత్వికంగా మాట్లాడటం, అందరూ కలిసి ఎటువంటి తేడాలు లేకుండా ఒకలాగా కలిసి మెలిసి భజనలు చేయ్యటం, తినటం మొదలైనవి చూస్తుంటే సమాజంలో మనంకోల్పోయినది తిరిగి అందినట్లైంది. మాతో వచ్చిన వారిలో చిరుద్యోగులున్నారు...ఆఫీసర్లు, లారీ డ్రైవర్లు మొదలైన వారున్నప్పటికీ...ఎవరూ తమ అహంకారం గానీ హొదాని కానీ, లేదా ఒకరినొకరు ఆధిపత్యం చెలాయించటం కానీ చెయ్యాలనుకోలేదు. అన్నిటికన్నా ముఖ్యమైనది చిన్న పిల్లలుగా వచ్చిన "చిరు స్వాములకి" ఇచ్చే గౌరవం...నాకనిపించింది ఇంత చిన్న పిల్లలకి ఈ భక్తి నియమాలెందుకని; కానీ, మాల వేసుకొన్నాక వారికి పెద్ద వారిచ్చే గౌరవం వలన మనం పద్ధతిగా వుంటే పెద్దలు గౌరవిస్తారు అని ఆ పసి మనసులలో నాటుకుంటానికి చాలా దోహద పడుతుందని తెలిసింది.

స్వాములలో అందరూ ఒకటేనన్న భావం తప్ప కులాలకి తావు లేదు. ఎవరు ఎక్కువ సార్లు శబరిమలై అయ్యప్ప స్వామిని దర్శించుకుంటే వారికి అంత ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ముఖ్యంగా ప్రతీ సంవత్సరం దీక్ష తీసుకోవటం వలన వేసిన వారిలో వున్న ఏ దురలవాటైనా, దుర్గుణమైన క్రమంగా నశించవలసిందే మరి.

ఇంతెందుకు ఒక సమాజం కలిసికట్టుగా ఉండటమేమిటో ఈ స్వామి దీక్షల వలన తెలుస్తుంది. ఈ దీక్షా కాలంలో శబరిమలకి వెళ్ళ వలసిన స్వాములు 'అందరూ' రోజుకొకరి ఇంట్లో చేరి అన్ని వర్గాల వారూ కలిసి భజనలు ఒకేరకమైన స్వరంతోచెస్తూ, అందులో పాడేది అరవమా, తెలుగా లేక మళయాళమా అన్న భాషా భెధం లేకుండా చిన్న పిల్లలు దగ్గర నుండి పెద్ద వారుదాకా 'అందరూ' కలిసి భజనా స్వరం..నాదం వింటుంటే నాకు భక్తితో పాటు "మనందరం ఒకటే, ఒకరికి ఒకరున్నాము" అనే భరోసా బలంగా వినపడింది.

ఇక యాత్ర విషయానికొస్తే సంక్రాంతి పండగ ముందు ఒక చల్లని సాయంత్రం విజయవాడ నుండి బొకారో-అలెప్పీ రైలులో బయలు దేరి మరునాడు సాయంత్రం ఎర్నాకుళం చేరాము. ఈ యాత్రలో మనం కొట్టాయం కూడా దిగవచ్చును. కానీ, చెంగనూరు నుండి శబరిమలైకి వెళ్ళటానికి మొదటి మెట్టైన "ఎరుమేలి" దగ్గర. ఎరుమలై అంటే మన తిరుపతిలో అలిపిరితో సమానం లాంటిదే. మేము ఎర్నాకుళం నుండి బస్సులో నాలుగున్నర గంటల ప్రయాణం చేసి రాత్రి 11.30 కి ఎరుమలై చేరాము.

అక్కడ అంతా పండగ వాతావరణం నెలకొని వున్నది. ఎరుమేలి అనేది ఒకప్పుడు శ్రీ అయ్యప్ప స్వామి తిరుగాడిన మరియు వేటాడిన ప్రదేశమట...అందుకని అక్కడికి చేరిన భక్తులు చేతులో విల్లంబులు, కత్తులు[చెక్కవి..అక్కడ దొరుకుతాయి]చేతబట్టి, రకరకాలైన డప్పు వాయిద్యాల మధ్యన నృత్యాలు చేస్తూ అక్కడ ఉన్న అయ్యప్పస్వామి ఆలయ వీధిలో సంచరిచటం చూస్తే మనలో కూడా ఆనందం పెల్లుబుకుతుంది. అలా నృత్యం చేస్తున్నవారిలో అనేకమంది సామాజిక హొదా కలిగినవారే....వారు దేవుడిదగ్గర, సమాజంలోనూ ఒకరికంటే మరొకరు ఎక్కువ కాదూ అని నిరూపించారు.

ఎరుమేలి నుండి రెండురకాలుగా యాత్ర విభజించబడుతుంది. ఒకటి పెద్ద పాదం అనగా "వనయాత్ర". దీనిలో భాగంగా ఇరుములై నుండి పూర్తిగా అరణ్యం, కొండల మార్గాన 45 కిలోమీటర్లు ప్రయాణం చేసి పంబ చేరవలసివుంటుంది. దీనికి కనీసం 18 నుండి 24 గంటల సమయం పడుతుంది. పూర్వం కాలంలో అందరూ ఆ మార్గానే వేళ్ళ వలసి వచ్చేదట. రెండవది చిన్న పాదం...అనగా ఎరుమేలి నుండి రోడ్డు మార్గాన బస్సులో పంబ వెళ్ళటం. పంబ దగ్గర నుండి పూర్తిగా కొండ మార్గానా శబరిమలైకి 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళ వలసివుంటుంది. మాతో వచ్చిన వాళ్ళు మొదలు అనుకున్న ప్రకారం వనయాత్ర చేద్దామనుకున్నారు. కానీ, అక్కడి అడవుల్లో పెద్ద గా వర్షం పడుతోందని వార్త తెలిసి మానుకున్నారు.



అందరూ కలసి బస్సులో పంబ వెళ్ళాము. ఇక్కడే పవిత్ర పంబా నది ప్రవహించేది. ఇక్కడ చల్లటి పంబా నదిలో స్నానం చేస్తే ప్రయాణపు బడలిక మొత్తం మాయమవుతుంది. ఇక్కడ అన్నీ దొరుకుతాయి కానీ సహజంగా మిగిలిన పుణ్య క్షేత్రాలకిమల్లే ధరలెక్కువ. [ విషయంలో విజయవాడ దుర్గమ్మ భక్తులు అదృష్టవంతులు; కొండ దిగి క్రిందకు వస్తే ఏ రకమైనా వస్తువులైనా చవుకైన ధరల్లో దొరికే విజయవాడ 1 టవును వున్నది.]

ఇక్కడనుండి ఏటవాలుగా వున్న కొండ ఎక్కుతుంటే దేవుడు కనిపిస్తాడు. ఇది చాలా కష్టమనిపించింది [వనయాత్రకంటే కాదుట]ఈ కొండ ఎక్కటాని మొగవాళ్ళందరూ అర్హులే. కానీ, 10 నుండీ 50 సంవత్సరాల లోపల వయస్సు వుండే ఆడవారికి మాత్రం అర్హత లేదు. అటువంటి వారు వస్తే క్రిందనే వున్న అన్ని సదుపాయాలున్న వసతి గృహంలో పోలీసుల రక్షణతో ఉంచుతారు. తరవాత, ఈ కొండ ఎక్కలేని వారికి డోలీ సదుపాయం కూడా వున్నది. వాటికి ధరలు ఎక్కటానికి 1200/-, దిగటానికి కూడా కలిపితె 2300/- ధర ఎక్కువనిపించినా పైకెక్కుతుంటే తెలుస్తుంది; మన బరువు మనమే మొయ్య లేకుండా వుంటే, ఆ డోలీ మోసేవారు ఎలా మోస్తారా అని ఆశ్చర్యమేస్తుంది.

పైకెక్కే దారంతా కొంరాళ్ళూ, దానిపైన కాంక్రీటుతో కప్పివున్నది. దీనిని చేయింఛినది "మాలవ్య" అని అక్కడ శిలాఫలకం ఉన్నది. ఎన్నోవందలకోట్లు ఆదాయం వచ్చే ఆలయానికి ఆయన చేత చేయించుకోవలసిన అవసరమేమిటో నాకర్ధం కాలేదు. ఇలా చెయ్యకముందు ఈ పైకెక్కే దారి మట్టితోనూ, మొక్కలతోనూ ఉండేదట. యాత్రికులు వచ్చే సమయానికి కొన్నిచెట్లు నరికి దారికి అడ్డంగా వేసి మట్టి జారకుండా చేసేవారుట. దీనికి తోడు కొండల్లో వచ్చే నీరు, వర్షం....పైకెక్కటమంటే చాలా కష్ట సాధ్యంగా వుండేదని నాతో వచ్చిన ఒక పెద్దాయన [పేరు రంగారావుగారు] చెప్పుకొచ్చారు.

సరే, మనం కోండ ఎక్కుతుంటే దారిలో అన్ని రకాల తినేవి దొరుకుతాయి. ఇంకొకటి ఏమంటే పైకెక్కే వాళ్ళకి క్రిందికి దిగే వాళ్ళు సపర్యలు చేయ్యటం కనపడుతుంది. తినటానికి గ్లూకోసు లేక ఏమైనా తినేవి ఇవ్వటం, చేతిలో వున్న తువ్వాలుతో విసరటం మొదలైనవి చేస్తుంటారు. ఇలా వారికి అనిపించటమే శబరిమలై అయ్యప్ప యాత్రలోని సార్ధకత అని వేరే చెప్పనక్కరలేదు.


ఇలా ఆయాసపడుతూ పైకెక్కిన తరవాత మొట్ట మొదటిగా చెయ్యవలసిన అయ్యప్ప స్వామివారి దర్శనమే తప్ప మరొకటి కాదు. ఇలా పాద ధూళితో స్వామివారిని దర్శిస్తే చాల పుణ్యమని గురుస్వాములు చెప్పారు. దీక్షలో ఉన్నవారంతా ఆలయం ఎదురుగా వున్న 18 మెట్లు ఎక్కి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అక్కడితో వారి దీక్ష పూర్తైనట్లు అవుతుంది. దీక్ష తీసుకోని నాలాంటి వారు సూటిగా ప్రక్కనుండి ఆలయం ఎదురుగా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇంకో విషయం ఏమిటంటే దీక్ష తీసుకోని వారు తక్కువ ఉండటం వలన తొందరగా దర్శనం అవుతుంది. ఇక్కడ మంచితనం ఏమిటంటే స్వామి వారి దర్శనం కాకుండానే "రూము ఎక్కడ", "లడ్డూలు ఎక్కువ ఎక్కడ దొరుకుతాయన్న "ఆబ్లిగేషను భక్తుల" గోలండదు. పైన తిరుమలలో ఉన్న అన్ని సౌకర్యాలున్నప్పటికీ స్వామివారి దర్శనం తరువాత ప్రసాదం తీసుకొని క్రిందికి దిగి వెళ్ళే భక్తులే ఎక్కువ.

మేము పైన "అన్నదానం" మరియు "మెడికల్ క్యాంపు" నిర్వహించటానికి వెళ్ళటం వలన శబరిమలైలో 8 రోజులు ఉండటం జరిగింది. మరునాడు నాతోటి వచ్చిన ఇద్దరు పెద్దవారితో వెళ్ళి దర్శనం చేసుకొన్నాను. నాతోటి వచ్చిన ఒకాయన[పేరు శివాజీగారు] నన్ను అక్కడి ప్రధాన పూజారి[మేల్కోటి]దగ్గరకు తీసుకుకెళ్ళారు. ఇలా వేరొక చోట ప్రధాన పూజారిని మాములు వారు కలవటం సాధ్యమేనా....అందుకనే అయ్యప్ప యాత్ర అన్ని వర్గాల వారినీ, సామాన్యులనీ ఆకర్షించిందని నాకనిపించింది.

మరో దర్శనం మకర జ్యోతి చూసిన తరవాత అయినది. క్రింద నుండి ఆభరణాలు వస్తే వాటిని స్వామి వారికి అలంకరిస్తారు. ఆ సమయములోనే మకర జ్యోతి కనపడుతుంది. అయ్యప్పని రాజువి కమ్మని ఆయన తండ్రి కోరగా, స్వామి నిరకరించటంతో తండ్రి గారు విచారపడి "నీ కోసం నగలన్నీ చేయించి పెట్టాను" అనగా, దానికి స్వామి వాటిని "మకరసంక్రమణం" రోజున అలంకరించి చూసి ఆనందించమని తండ్రికి చెపుతాడు. కానీ చిన్న వాడైన తనను చూసి తండ్రి నమస్కరించ కూడదు కనుక మకరజ్యోతిలో తన తండ్రికి దర్శనమిస్తాడని గురుస్వాముల ద్వారా తెలిసింది. ఆ అడవి మార్గాన నగల రక్షణ కోసం ప్రజలను మరలించటం కోసం మకరజ్యోతిని వెలిగిస్తారేమో అని నాకనిపించింది. ఎందుకంటే మకరజ్యోతి సమయంలోనే క్రిందనుండి నగలు రావటం జరుగుతుంది.

జ్యోతి దర్శన సమయంలో మరొక విచిత్రం జరిగింది. క్రిందటేడు ఏదో జరిగిందనీ, కాటేజీల పైకి ఎవరూ వెళ్ళకుండా తాళాలు వేశారు. భక్తులకి ఆ సంగతి చివరి సమయంలో అనగా సాయంత్రం ఆరు అవుతుండగా తెలిసింది. ఈ చర్యని నిరసిస్తూ భక్తులందరూ అయ్యప్ప భజన మోదలు పెట్టారు. అది చూస్తే నాకు టీవీల్లో చూపించే ఇతర దేశాల ఉద్యమాల నినాదల హొరు లాగా వినపడింది...టీవీల్లో చూస్తున్నప్పుడు నేననుకునేవాణ్ణి, ఇలా మన దేశంలో కలిసికట్టుగా తమకోసం నినదించేంత సమైక్యత ఉంటుందా అని!!! కానీ నా అలోచన తప్పని వారి అయ్యప్ప నినాదాల హొరు చెప్పింది. చివరికి తాళం చెవులు వచ్చాయి. కానీ, మాదగ్గరకి వొచ్చేటప్పటికి ఆలస్యం జరగటంతో మా కాటేజీలో వున్న వాళ్ళు తాళం పగులకొట్టి మరీ పైకి వెళ్ళారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటే ఎమవుతుందో అదే జరిగింది. తరవాత పోలిసులు వచ్చారు కానీ, వారు మౌనంగా ఓ ప్రక్కన నుంచున్నారు. తరవాత మకరజ్యోతిని 3 సార్లు చూశాము. ఆ సమయలో వినపడిన హొరు లేక నాద ధ్వని నేను మునుపెప్పుడూ వినలేదు. దరిదాపులు నిమిషంపైన ఆ హొరు జనసముద్రంలో నుండి వచ్చింది.

ఇకపోతే, ఈ మకరజ్యోతి గురుంచి మన "మీడీయా వారూ, బాధ్యతగల విజ్ఞానంగల పౌరులూ" చాలా బాధపడి కోర్టుకి వెళ్ళారు. కోర్టు కూడా జ్యోతి రహస్యాన్ని వెల్లడించమని "ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు" వారిని ఆదేశించింది. బాగానే వున్నది. ఇదే విషయంలో "ఇతరుల" మనోభావాలకి సంబంధిచిన "విషయాలు" వెల్లడించమనే ధైర్యం మన బాధ్యతగల పౌరులకి ఉన్నాదా?.....ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువమంది గుమికూడి తొక్కిసలాడుకునే అనేక ప్రదేశాలున్నాయి. హింసాయుతమైన పండగలూ ఉన్నాయి. వాటిగురించి ఈ బాధ్యతగల పౌరులకి ఏమైనా శ్రద్ధ వున్నదా...ఒక వేళ నిజంగా ప్రజల గురించి శ్రద్ధ ఉంటే ప్రతీ సంవత్సరం కొన్ని వందల కోట్లు ఆదాయం వచ్చే ఈ శబరిమలై ఆలయం అభివృద్ధి గురించి ఆ కోట్ల రూపాయలు ఎందుకు వాడట్లేదని ఎవరైనా కోర్టుకి వెళ్ళారా?? కోర్టువారు కూడా స్పందించినప్పుడు ఇక్కడి సౌకర్యాలకి ఆ కోట్లు వాడమని దేవస్థానం బోర్డుని ఆదేశించి ఉంటే ప్రజలకి ఉపయోగకరంగా ఉండేదేమో...?? కేవలం మకరజ్యోతి రహస్యానికే ప్రాధాన్యతనిచ్చిన మన "గొప్ప బాధ్యతగల పౌరులు" దానికి సౌకర్యాలని కల్పించమని అడగటంలో ఎందుకు శ్రద్ధ వహించలేదు....???

సమాధానం చాలా తేలిక.......అయ్యప్ప యాత్రవలన కలిగే సామజిక చైతన్యం చూసి ఒర్వలేని "ఇతరులు" చేసే గొడవ, రగడే తప్ప మరొకటికాదు. అయ్యప్ప భక్తి యాత్రలో ఇమిడి ఉన్న సామజిక చైతన్యమే ఈ "ఇతరులకి" ఇబ్బంది కలిగేది. మనలో మనం కులపోరాటాలు చేసుకుని విడిపోయుంటేనే వీళ్ళ ఆటలు సాగుతాయి. ఈ ఇతరులలో "సైన్సు మూఢులు" కూడా ఉన్నారు. వీరికి నమ్మకానికి శాస్త్రానికీ{సైన్సుకీ} తేడా తెలియదు. నమ్మకానికి ఆధారం ఉంటేనే శాస్త్రమని ఈ మూర్ఖుల "నమ్మకం". మన పూర్వీకులు కూడా ఆధారాలు లేనివన్నీ శాస్త్రం కాదని అనివుంటే ఇప్పుడీ సైన్సు[శాస్త్రం] ఇంత అబివృధి చెందేది కాదని ఈ సంకుచిత సైన్సు మూర్ఖులకి తెలియదు.......విచిత్రమేమంటే ఈ శాస్త్రవేత్తలు "ఇతరుల" జోలికి వెళ్ళరు మరి!!!.............శబరిమలై యాత్ర అంటే భక్తితో కూడుకున్న సామాజిక ఉద్యమమే....కాబట్టి. ఇకనైనా అందరూ అన్నీ ఆలోచించి బాధ్యతగా మెలగాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే శబరిమలై యాత్రవలన సమాజంలోని చెడు తొలగింపబడుతోందే కానీ...మూఢనమ్మకాలంటూ ఎవరినీ బలి తీసుకోవటం లేదు.

తిరుగు ప్రయాణంలో ఓ కర్ర చేతపట్టి దిగాము. దిగేటప్పుడు ఏటవాలుగా వుండటంతో కర్ర వుంటే మంచిది. దిగేటప్పుడు నాకొక హైదరాబాదు కుర్రాడు కలిశాడు...అతను చెప్పిన ప్రకారం అయ్యప్పదగ్గరకి రావటం వలననే అతనికి దురలవాట్లుపోయి ఆరోగ్యం సమకూరిందని తెలిసింది. మేము కూడా దారిలో పైకెక్కేవారికి కొంత సేవ చేస్తూ పంబ చేరాము. అక్కడనుండి కేరళ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి సాయంత్రానికి తిరువనంతపురం శ్రీ అనంతపద్మనాభుని దర్శించుకున్నాము. మరునాడు ఉదయం గోరఖ్‌పూర్ రైలులో బయలుదేరి 25 గంటల ప్రయాణం చేసి విజయవాడ చేరుకొన్నాము.



చివరలో మళయాళం వారి ఏర్పాట్లు గురుంచి చెప్పుకొని తీరవలసిందే....ముందుగా భాష...మేము ఎర్నాకుళం నుండి ఎరుమేలి, అక్కడ నుండి పంబ...శబరిమలై...తిరిగి అక్కడనుంది పంబ మీదుగా వేరే దారిలో తిరువనంతపురం వెళ్ళాము. ప్రతీ చోటా దేవస్థానములోనూ, రహదారిపైనా తెలుగుతో పాటూ దక్షణ భారత దేశ భాషలన్నీ కనపడటం చాలా ఆనందం కలిగించింది. కొన్ని బస్సుల మీద కూడా తెలుగు ఉన్నది. కేరళా ఆర్టీసీ వారుకూడా చాలా బస్సులు వేసి భక్తులకి చాలా సౌకర్యం కల్పించారు. మనం శబరిమలై నుండి క్రిందకు దిగగానే ప్రైవేటు బస్సుల వాళ్ళు అధిక ధరలు చెపుతారు. వీరినుండి రక్షించటానికి దగ్గర్లోనే ఒక బస్టాండు ఏర్పాటు చేసి ప్రైవేటు బస్సుల దోపిడీ నుండి భక్తులని కాపాడారు. తరవాత అక్కడి పోలిసులు కూడా చాలా సంయమనంగా వ్యవహరించి, ఎక్కడా దురుసుదనం ప్రదర్శించక పోవటం కూడా చెప్పుకొతగ్గ విషయం.

ఏది ఎలావున్నా, యాత్ర బ్రహ్మండంగా జరిగింది. ఎటువంటి దుష్ప్రచారాలనూ నమ్మకుండా లక్షలాది భక్తులు తమ మంచి జీవితం కోసం, దురలవాట్లను మానిపించే అయ్యప్ప కోసం వచ్చి మంచి సమాజానికి దారి చూపించారు. కొసమెరుపేమిటంటే స్వామివారి పవళింపు సేవ, ఆలయద్వారాలు మూసేటప్పుడు ప్రతీ రోజూ జేసుదాసుగారి "హరివరాసనం" అనే గీతంతో ముగిస్తారు. మనవాళ్ళ హృదయం ఎంత విశాలమైనదో దీనిబట్టి అర్ధమవుతుంది.


స్వస్తి.

వ్యాఖ్యల కొరకు క్రింది లింక్ నొక్కండి